న్యూఢిల్లీ : ‘పరీక్షలు, పరీక్షలు, పరీక్షలు జరపండీ! కరోనా వైరస్పై యుద్ధం చేయడానికి ఇదే అసలైన, అవసరమైన మార్గం’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధానమ్ గెబ్రియేసెస్ మార్చి 16వ తేదీన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అయినప్పటికీ భారత్ ఈ విషయంలో పెద్దగా స్పందించినట్లు లేదు. మార్చి 23వ తేదీ వరకు భారత్లో కేవలం 18,383 మందికి మాత్రమే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 433 మందికి కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే దాదాపు సగం కేసులు నమోదయ్యాయి.
అదే మార్చి 18వ తేదీ నాటికే ఇటలీలో 1,65,541 మందికి, దక్షిణ కొరియాలో 2,95,647 మందికి పరీక్షలు నిర్వహించింది. దక్షిణ కొరియా ప్రతి రోజూ 20 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తోంది. బ్రిటన్ రోజుకు 1500 ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మున్ముందు రోజుకు పది వేల మందికి చొప్పున పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. భారత్ కరోనా పరీక్షలు ఇంత తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని పుణేకు చెందిన ‘గ్లోబల్ హెల్త్, బయోటిక్స్, హెల్త్ పాలసీ’ రిసర్చర్ అనంత్ భాన్ హెచ్చరిస్తున్నారు. (మరోసారి జాతి ముందుకు ప్రధాని మోదీ)